Hope Outreach & Living Hope


సజీవ నీరీక్షణ దైవ సందేశములు
Click on Play button to listen

 
 
Total visitors : 1079
Total views, this Message : 21

#27 రోమీయులకు 7 :

రోమా పత్రిక అధ్యయనం 7 - దేవుని తీర్పునకు ఆధారపు పునాదులు

ప్రతి సంస్కృతికి చట్టము, శాంతిభద్రతలు కాపాడ్డానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రతి దేశములో న్యాయాధిపతులు కొన్ని చట్టములమీద ఆధారపడి పనిచేస్తారు. మనము పనిచేయడానికి ఒక ఆధారం కావలసి ఉన్నట్టే, న్యాయస్థానములలో న్యాయమూర్తులు కొన్నిటిమీద ఆధారపడి న్యాయం తీరుస్తారు. వారికి ఆ ఆధారాలు లేకపోయినట్లయితే వారు సరియైన న్యాయమూర్తులు కారు. న్యాయం కోసం నిలబడ్డ వారికి ఏ ఆధారపు పునాదులనుబట్టి తీర్పు తీర్చబడుతుందో తెలిసిఉండాలి.

దేవుడు తన న్యాయపు పధ్ధతిలో ఎంతో కృపగలవాడు. మనమందరమూ దేవుని న్యాయ స్థానంలో ఆయన ముందు నిలబడతామని బైబిల్ సెలవిస్తున్నది. దేవుడే న్యాయమూర్తి. మానవ జాతి అంతా కూడా, ప్రతి ఒక్కరూ దేవుని న్యాయతీర్పు కోసం ఆయన ముందు నిలబడాలి. దేవుడు ఏ ఆధారపు పునాదులనుబట్టి తీర్పు తీర్చబోతున్నాడో మనకు చెప్పిఉన్నాడు.

పౌలు రోమీయులకి పత్రిక వ్రాసినపుడు దేవుడు ఏ ఆధారపు పునాదులనుబట్టి తీర్పు తీరుస్తాడో జాగ్రత్తగా వివరించాడు. లేఖనభాగం రోమా. 2:12-16

12. ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.

13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.

14. ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.

15. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు

16. దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

స్నేహితుడా, సోదరీ, ఈ మహత్తరమైన లేఖన భాగము దేవుని న్యాయతీర్పు యొక్క ఆధారపు పునాదులను తెలుపుతుంది. దేవుని న్యాయతీర్పు ఆయన మానవ జాతి అంతటి కోసం చేసిన చట్టముల మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాను గమనించండి. దేవుడు చేసిన చట్టముల మీద ఆయన న్యాయతీర్పు ఆధారపడి ఉంటుంది, మానవులందరూ ఆ చట్టము క్రిందికి వస్తారు.

మోషే ధర్మశాస్త్రము దేవుని న్యాయతీర్పునకు మొదటి ఆధారం: మోషే ధర్మశాస్త్రము సీనాయి పర్వతం పైన దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. పాత నిబంధనలో రెండవ గ్రంధం నిర్గమ కాండము. ఎవరైనా దీన్ని పఠిoచవచ్చు. అక్కడ దేవుడు ఈ చట్టమును మోషేకు అనుగ్రహించినట్టు వ్రాయబడింది. అందుకే దాన్ని మోషే ధర్మశాస్త్రం అన్నారు. అది నిజానికి దేవుని ధర్మశాస్త్రం కాని, దేవుని వద్దనుండి మోషే పొందాడు. దాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వటానికి పొందాడు. వారు దేవుని ప్రత్యేక ప్రజలుగా ఉండవలసింది. దేవుని ధర్మశాస్త్రం అందుకునే ఈ ప్రత్యేక భాధ్యత ఏ ఇతర ప్రజలకు ఇవ్వబడలేదు. ఏ ఇతర ప్రజలు ఇంత దయ పొందలేదు, ఇంత భాధ్యత పొందలేదు.

దేవుడు మోషేకు ఇచ్చిన ఆ చట్టములో వారు ఎలా జీవించాలో చెప్పాడు. అలా జీవించనట్లయితే వారి ఆవిధేయత, తిరుగుబాటును బట్టి వారిని శిక్షిస్తానని కూడా హెచ్చరించాడు. ఆపో. పౌలు 12వ వచనములో సరిగ్గా అలాగే చెబుతున్నాడు. “ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.”

ఇంకా చెబుతూ, “ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.“ అని వివరిచాడు. దేవుడు న్యాయతీర్పు తీర్చే ఒక ఆధారం మోషే ధర్మశాస్త్రం. దేవుని పరిశుద్ధత యొక్క ప్రమాణాలు మోషే ధర్మశాస్త్రంలో స్పష్టమయ్యాయి, ఎవరు ఆ చట్టంక్రింద జీవిస్తారో వారు ఆ చట్టం ప్రకారం తీర్పు తీర్చబడతారు.

దేవుడు తన తీర్పును తీర్చే రెండవ ఆధారం ప్రకృతి స్వభావo. పౌలు 14వ వచనములో ఈ సత్యమును బోధించాడు. “ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రములేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.” ఈ ప్రకృతిస్వభావపు చట్టం అందరికీ ఇవ్వబడింది. కానీ యూదులుకానివారు ఇశ్రాయేలీయులలాగా మోషే ధర్మశాస్త్రం అందుకోలేకపోయినా, వారికి ప్రకృతిసిద్ధంగా ఉన్న స్వభాములోనే, వారి మనసుల్లో హృదయాలలో ఒక చట్టం ఉంది. అందుకే వారు ధర్మశాస్త్రంలోని సంగతులను చేసిఉన్నారు.

మనసు హృదయం, ఆత్మలు కలిసిఉన్న మానవుని స్వభావములో దేవుడు దాన్ని ఇమిడ్చిపెట్టాడు. దాని ద్వారా కొన్ని మంచివనీ, కొన్ని చెడ్డవనీ మానవుడు తెలుసుకుంటున్నాడు. కొన్ని క్రియలు అంగీకరించబడతాయి. మరి కొన్ని తీర్పుకు లోనవుతయాయి. ఇది ప్రకృతి చట్టం.

అయినప్పటికీ అక్కడ కూడా పాపమునకు తీర్పు తప్పదు. ప్రజలకు మోషే ధర్మశాస్త్రం లేకపోయినా, ప్రకృతీసిధ్ధంగా ఏది దుష్టత్వమో, ఏది మంచిదో ప్రకృతి చట్టం చెబుతుంది. ప్రకృతి చట్టం క్రింద ఉన్నవారు ప్రకృతి చట్టం ప్రకారం సరియైన క్రియలు చేయక ఆ చట్టం మీరినపుడు దేవుడు తప్పక వారికి తీర్పు తీర్చాలి. దేవుని పరిశుద్ధత ప్రమాణాలు ప్రకృతి చట్టంలో కూడా స్పష్టంగా ఉన్నవి.

దేవుని న్యాయతీర్పు యొక్క మూడవ ఆధారం మనస్సాక్షి అనే చట్టం. ఈ ఆధారమును పౌలు 15వ వచనంలో స్థిరపరిచాడు. “అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను,…. ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు” ఉన్నది. ప్రతి ఒక్కరికీ మనస్సాక్షి ఉన్నది. దాన్ని “మానవుని ఆత్మలో దేవుని స్వరం” అని పిలుస్తుంటారు. అది హృదయంలో వ్రాయబడింది. మానవులకు జంతువులకు ముఖ్యమైన బేధం ఏమిటనగా మానవునికి ఏది మంచి ఏది చెడు తెలుసుకొనే తెలివి ఉన్నది. అది మన హృదయములలో వ్రాయబడిఉన్నది, కాబట్టి మనస్సాక్షి, మన తలంపులు మనలను దోషారోపణ చేస్తాయి, లేదా ఒప్పుకుంటాయి. చూడండి, మన లోపటి తలంపులు దోషారోపణ చేస్తాయి గాని , లేదా తీర్పు తీరుస్తాయి. లేదా మెచ్చకుకొని, అది మంచిదని చెప్పుతూఉంటాయి. వీటి గురించి సాక్ష్యం చెప్పేది మనస్సాక్షి. జీవిస్తున్న ప్రతి మానవునిలోపల ఉన్న మనస్సాక్షి అనే చట్టం లో దేవుని పక్షపాతoలేనితనమును ధ్రువపరుస్తుoది. మనస్సాక్షి అనే ఒక దేవుని చట్టం దేవుని న్యాయతీర్పు ఆధారములలో ఒక్కటి.

దేవుని నాయయతీర్పునకు చివరి ఆధారపు పునాది సువార్త. పౌలు దీన్ని 16వ వచనములో చక్కగా బోధిస్తున్నారు. “దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మను ష్యుల రహస్యములను విమర్శించు దినమందు… . .. ” యేసు క్రీస్తు సువార్త అందరికోసం. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” బైబిల్ లోని బంగారు వాక్యం యోహాను 3:16.

పౌలు మరో పత్రికలో సువార్తను క్రోడీకరించాడు. అది తీతు పత్రిక 2:11-14 లో ఉన్నది. “సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.”

నా స్నేహితుడా, సోదరీ, ఈ సువార్త చట్టం అందరికోసం. మనుషుల రహస్యమైన సంగతులు సువార్తను బట్టి న్యాయతీర్పు లోనికి వస్తాయి. ఇది దేవుడు తన న్యాయతీర్పు చేయడానికి అనుగ్రహించిన చివరి ఆధారము.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక చట్టం కిందికి వస్తారు: మోషే ధర్మశాస్త్రం అనే చట్టం, ప్రకృతిస్వభావం అనే చట్టo, మనస్సాక్షి అనే చట్టం, సువార్త అనే చట్టం. మనలో ప్రతి ఒక్కరము వీటి క్రిందికి వస్తాము. తప్పనిసరిగా, చివరిది వాటన్నిటిలో ప్రముఖ్యమైనది, ఎందుకనగా దేవుడు మనుషుల రహస్యములను యేసు క్రీస్తు సువార్తను బట్టి తీర్పు తీర్చబోతున్నాడు.

ప్రార్ధన: సమస్త సృష్టికి సృష్టికర్త వైన సర్వోన్నవతుడవైన దేవా, మీ న్యాయ చట్టములు సత్యమైనవి, న్యాయబద్ధమైనవి. మీరే మా సృష్టికర్త యని ప్రతి ఒక్కరూ నమ్ముటకు సహాయము చేయండి. మా మనస్సాక్షి దోషారోపణ చేస్తున్న వాటన్నిటినీ న్యాయాధిపతి అయిన నీ ఎదుట ఒప్పుకొని మా హృదయములను మీకర్పించి సువార్తను నమ్ముటకు సహాయము చేయండి. దుఖములో, బాధలలో, వేదనలలో చిక్కుకున్నవారిని ధైర్యపరచండి. మా అందరికీ మీ కృప అనుగ్రహించుమని క్రీస్తురక్షకుని పరిశుద్ధ నామములో వేడుకొంటున్నాము తండ్రీ, ఆమెన్!